
నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్.
మానేటి న్యూస్ జగిత్యాల డిసెంబర్ 02
జగిత్యాల జిల్లాలో 144 గ్రామాలు, 1276 వార్డులకు రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ డిసెంబర్ 2 తో ముగియనున్న నేపథ్యంలో రాయికల్ మండలం వడ్డె లింగపూర్, కొత్తపేట మరియు అల్లీపూర్ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల్లోని నామినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం రిజర్వేషన్ల వివరాలు నోటీస్ బోర్డుపై సక్రమంగా ప్రదర్శించబడ్డాయా అనే విషయాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ప్రస్తుతం వరకు ఎన్ని నామినేషన్లు స్వీకరించబడ్డాయి, అలాగే నామినేషన్ల పత్రాలు ఎంతమంది అభ్యర్థులు తీసుకున్నారనే వివరాలను సంబంధిత అధికారుల నుంచి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్ల ప్రక్రియను నిర్వహించాలని, నామినేషన్ దరఖాస్తు ఫారాలు తీసుకున్న వారి వివరాలను కూడా రిజిస్టర్ లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
దాఖలైన నామినేషన్లకు సంబంధించి జిల్లా కేంద్రానికి సకాలంలో రిపోర్టులు పంపించాలని అన్నారు. నామినేషన్ స్వీకరణ, రికార్డు నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, అభ్యర్థులకు అందిస్తున్న సౌకర్యాలపై ఆయన పలు సూచనలు అందించారు.
నామినేషన్ ప్రక్రియ చట్టబద్ధంగా, ఎవరికీ ఇబ్బందులు లేకుండా పూర్తయ్యేలా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
హెల్ప్ డెస్క్, పోలీస్ బందోబస్తు మరియు తదితర అంశాలను పరిశీలిస్తూ, సపోర్టింగ్ స్టాఫ్ సరిపడా ఉన్నారా అని ఆరా తీశారు. నోటీసు బోర్డులపై అతికించిన నోటిఫికేషన్ పత్రాలను తనిఖీ చేశారు.
ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, విధుల్లో ఉన్న ప్రభుత్వ సిబ్బంది నామపత్రాలు దాఖలు చేసే విషయంలో అభ్యర్థులకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు.
ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటిస్తూ, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా ఉన్నతాధికారులను సంప్రదించాలని సూచించారు.
నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2 వరకు రెండవ విడత ఎన్నికల ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 వరకు నామినేషన్ పత్రాలు సమర్పించవచ్చని తెలిపారు. డిసెంబర్ 3 రోజున వీటి పరిశీలన ఉంటుందని తెలిపారు. డిసెంబర్ 6 వరకు ఉపసంహరణ గడువు ఉంటుందని తెలిపారు.
రెండవ విడతలో 7 మండలాల్లోని 144 గ్రామాలు, 1276వార్డుల్లో డిసెంబర్ 14 న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుందని అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు.
ఈ పరిశీలనలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, ఎమ్మార్వో నాగార్జున, ఎంపీడీవో చిరంజీవి, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.