
మానేటి న్యూస్ కరీంనగర్ నవంబర్ 18/
రాష్ట్రంలో నిలిచిపోయిన మున్సిపల్ ఎన్నికలను త్వరితగతిన నిర్వహించేలా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ను కరీంనగర్ మాజీ మేయర్, బీజేపీ నేత యాదగిరి సునీల్రావు కోరారు.మంగళవారం హైదరాబాద్కు వచ్చిన కేంద్ర మంత్రిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సునీల్రావు నగర సమస్యలపై వినతిపత్రాన్ని మంత్రి ఖట్టర్కు అందజేశారు.నగరపాలక సంస్థలో పాలకవర్గం లేకపోవడం వల్ల అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయాయని, 15వ ఆర్థిక సంఘ నిధులు కూడా నిలుపుదల కావడంతో నగర అభివృద్ధి తీవ్రంగా దెబ్బతిన్నదని ఆయన వివరించారు. డంప్యార్డు సమస్య రోజురోజుకూ మరింత తీవ్రమవుతూ ప్రజలు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి నెలకొన్నదని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రక్షాళన నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు.మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడటంతో రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల అభివృద్ధి ఆగిపోయిందని, ఎన్నికలను త్వరగా నిర్వహించేలా కేంద్రం జోక్యం చేసుకోవాలని సునీల్రావు అభ్యర్థించారు. కరీంనగర్ నగర ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి కేంద్రం ప్రత్యేక చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో రాంచందర్రావుతో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.