

మానేటి న్యూస్ కరీంనగర్ నవంబర్ 18/
యువత, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే మత్తు పదార్థాల మూలాలను పెకిలించివేయాలని, డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చి దిద్దాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో పోలీస్, ఎక్సైజ్, వైద్య ఆరోగ్య, శిశు సంక్షేమ, విద్య తదితర శాఖల అధికారులతో జిల్లాస్థాయి నార్కో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాతుతూ మత్తు పదార్థాల వినియోగంతో కలిగే దుష్పరిణామాలపై బహిరంగ ప్రదేశాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. పోలీస్, ఎక్సైజ్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో విస్తృత తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.వైద్యులు రాసిన చీటీ లేకుండా మత్తు మందులను, ఇంజక్షన్లను మెడికల్ షాపుల్లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మెడికల్ దుకాణాలలో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో స్నేహిత కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో విస్తృత అవగాహన కొనసాగించాలని అన్నారు. అవగాహన కార్యక్రమాల్లో పోలీసులను భాగస్వాములను చేయాలని తెలిపారు.కరీంనగర్ సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ.. మత్తు పదార్థాల నిర్మూలనకు నిత్యం గస్తీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వ, ప్రైవేటు హాస్టళ్ళు, ఆర్టీసీ కార్గో, ప్రైవేట్ పార్సిల్ సంస్థలతోపాటు ఆన్లైన్ సంస్థలకు సంబంధించి గోదాములను తనిఖీ చేస్తున్నట్లు వివరించారు. డ్రగ్ డిడక్షన్ కిట్లు, పోలీస్ డాగ్ సేవలను వినియోగిస్తున్నామని అన్నారు. నాఖాబంధి చేపట్టి విస్తృత తనిఖీలు చేస్తున్నామని వెల్లడించారు. మాదక ద్రవ్యాలు వినియోగం, సరఫరా వంటి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, పోలీస్, ఎక్సైజ్, విద్య, వైద్య, మహిళా శిశు సంక్షేమం, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.